జ్ఞాపకాలు
ఎప్పట్నుంచో
నాజీవితచరిత్ర వ్రాయాలని ఆశ.కాని అంత అవసరమా?అని
అంతరాత్మ వెటకారం. కనీసం ముందుతరాలకు చరిత్రయినా తెలుస్తుంది కదా! అనిపించి
వ్రాసేద్దామనుకొన్నా.20-12-1950 రికార్డుల ప్రకారం నాపుట్టిన తేదీ.బహుశా!దీనికంటే
రెండేళ్ళయినా వెనుక పుట్టివుంటానని మాపెద్దల అందాజు లెక్క.అప్పటి మా రాయలసీమ కఱవు
పరిస్థితులు తలచుకొంటేనే కంపరం పుడుతుంది.అనంతపురం జిల్లా,పెనుకొండ
తాలూకా,మైలసముద్రం జన్మస్థలం.మాది సూర్యవంశ క్షత్రియ కుటుంబం.మా
తాత గారిది” తరిమెల”సంస్థానమట.ఆ సంస్థానం అధీనంలో 56 గ్రామాలుండేవట.కాని అక్కడి
భూములు సారవంతమైనవి కాకపోవడం,నీటిసౌకర్యం లేకపోవడం,పైగా
ఆప్రాంతంలో నీలం సంజీవరెడ్డి,తరిమెల నాగిరెడ్డి లాంటి రాజకీయ ప్రముఖుల ముందు
తలదించుకోలేక, ప్రస్తుత ప్రాంతానికి తరలి వచ్చారట.ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్
మెంట్లో చిన్న ఉద్యోగం చేస్తూ మైలసముద్రానికి దగ్గర్లో వున్న ఒక విశాలమైన
శ్రోత్రియభూమిని కొని తన ఆరుమంది కుమారులు,ముగ్గురు
కూతుర్లతో, బంధువులందరికి దూరంగా నివసించసాగాడు. ఊర్లోని కమ్మ,కాపు
మొదలైన మధ్యతరగతి కుటుంబాలతో బంధువులకు మల్లే వరసలతో సంభాషించుకొంటూ వారితో మమేకమై
మనుగడ సాగిం చారు.అందుకే మాలో చాలామందికి మా కులాచారాలు,పద్ధతులు
తెలిసేవి కాదు.బాల్యంలో మాకు తెలిసిన మాబంధువులున్న ఒకేఒక వూరు ధర్మపురి(ధర్మవరం
దగ్గర్లోది)మాత్రమే!
తరిమెల నుండి
అన్నీ వదలుకొని వచ్చేశారు.కోటను,ఆస్తిపాస్తుల్ని,చివరకు
కులదేవతయైన చౌడేశ్వరిని తృణీకరించి వచ్చేశారు.రాగి ఫలకలపైన చెక్కిన కోటకు
సంబంధించిన ఫర్మానాలు,ఆయుధ పూజకని కత్తి డాలు లాంటి కొన్ని పరిమిత ఆయుధాలు మాత్రం
తీసుకొని వచ్చారు.తెచ్చిన ఆకొద్ది వాటినైనా జాగ్రత్తపరచుకోలేకపోయారు.పూర్తీగా
రైతులుగా మారిపోయి,లౌకికమైన కనీస జ్ఞానాన్ని కోల్పోయారు.ఎంతో చారిత్రిక
ప్రాధాన్యత కలిగిన ఆరాగి ఫలకల్ని కరిగించి
బిందెలు తపేలాలు చెంబులు చేయించుకొన్నారట.కత్తులు డాళ్ళు మొదలైన ఆయుధాలను
గొడ్డళ్ళు కొడవళ్ళుగా చేయించుకొని అసలైన రైతుల మనిపించుకొన్నారు.గతవైభవాన్ని,సంస్థానాధీశ
హోదాను మర్యాదల్ని కోల్పోయి కేవలం కుక్షింభరులుగా బ్రతుకు సాగించారు,’ రాజ్యాంతే
నరకమ్ ధ్రువమ్’ అని గదా పెద్దలన్నారు.
No comments:
Post a Comment